మహాశివరాత్రి విశిష్టత

ఆ పరమశివుడిని ఆరాధిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయి. శివయ్య అని మనసుపెట్టి తలిస్తే నేనున్నా అంటూ అందరి కోర్కెలను తీర్చే బోళా శంకరుడు అయిన పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రిని జరుపుకుంటారు. మహాశివరాత్రి రోజున శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతాయి. మహాశివరాత్రి పర్వదినం అంటే శివయ్యకు, శివుడి భక్తులకు అత్యంత ఇష్టమైన రోజు.

ఈరోజు ఎవరైతే భక్తితో శివుడిని పూజించి.. ఉపవాస, జాగరణ దీక్షలను ఆచరిస్తారో.. వారికి శుభాలు కలుగుతాయని.. శివుడి కటాక్షం వారిపై ఉంటుందని చెబుతారు. చాంద్రమాన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలోనూ శివరాత్రి పండుగ వస్తుంది. అయితే వీటిని మాస శివరాత్రిగా పిలుస్తారు. కానీ సంవత్సరంలో ఒకేసారి మాఘ మాసంలోని కృష్ణపక్షంలో చతుర్థి నాడు మహాశివరాత్రి వస్తుంది.మహాశివరాత్రి పర్వదినాన్ని శక్తి, ప్రేమ, ఏకత్వం యొక్క స్వరూపంగా భావిస్తారు. అసలు ఇంతకీ మహాశివరాత్రి ప్రాముఖ్యత ఏమిటి అంటే.. హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం జరిగినట్టుగా నమ్ముతారు. పరమశివుడు పురుషుడిని సూచిస్తే ప్రకృతిని పార్వతి దేవి సూచిస్తుంది. సృష్టికి మూలమైన శక్తి చైతన్యాల కలయికను మహాశివరాత్రి పర్వదినం సూచిస్తుంది.

బ్రహ్మ విష్ణు మహేశ్వరంలో ఎవరు గొప్ప అన్న వాదన వచ్చినప్పుడు.. ఆ సమయంలో ఈశ్వరుడు లింగ రూపం ధరించాడని ఆది అంతాలను కనుక్కోవాలని బ్రహ్మ విష్ణువులకు చెప్పాడని పురాణాలు చెబుతాయి. అయితే అది తెలుసుకోవడం కోసం మహా విష్ణువు శ్వేత వారాహరూపంలో మూలం కనుక్కోవడానికి వెళితే, బ్రహ్మ శివలింగానికి పైభాగం వైపు వెళ్తాడు. ఇద్దరూ మహా శివలింగానికి ఆదిఅంతాలను కనుక్కోలేకపోతారు. బ్రహ్మకు ఆ సమయంలో కేతకి పుష్పం, గోవు దర్శనమిస్తాయి. బ్రహ్మ తన శివలింగాన్ని కనుక్కున్నానని మొగలిపువ్వుకి, గోవుకు చెప్పి అదే విషయాన్ని విష్ణువు, శివుడితో చెప్పాలని చెబుతాడు. ఇక బ్రహ్మ చెప్పినట్టుగానే కేతకి పుష్పం, గోవు రెండు బ్రహ్మ శివలింగం యొక్క ఆధుని ఆదిఅంతాలను కనుకున్నాడని విష్ణువు, శివునికి చెబుతారు. వారిద్దరూ అబద్ధం చెబుతున్నారని గుర్తించిన శివుడు అబద్ధం చెప్పించిన బ్రహ్మకు.. భూలోకంలో గుడి పూజలు ఉండవని శాపాన్ని ఇస్తాడు. ఇక మొగలి పువ్వు పూజకు పనికిరానిదని శపిస్తాడు. గోమాత ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందుకు, గోమాత ముఖం చూస్తే పాపమని, తోక చూస్తే పాప పరిహారమని శివుడు శపిస్తాడు. శ్రీమహావిష్ణువు నిజం చెప్పడం వల్ల ఆయన విశ్వవ్యాప్తంగా అన్నిచోట్ల పూజింపబడతాడని శివుడు అనుగ్రహిస్తాడు.

బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణకోటిని రక్షించే భారాన్ని, మోక్షం ఇచ్చే అధికారాన్ని కూడా మహావిష్ణువుకు ఇవ్వడం లింగోద్భవ కాలంలోనే జరిగిందని శివపురాణంలోనూ, కూర్మా వాయు పురాణాలలోనూ ప్రధానంగా చెప్పబడింది. ఇక బ్రహ్మ కూడా శివుడికి లింగ రూపంలోనే ఉంటావని శాపాన్ని ఇవ్వడం వల్ల లింగ రూపంలోనే మహా శివుడికి పూజలు నిర్వహించడం జరుగుతోంది. ఇక శివయ్య అభిషేక ప్రియుడు.. మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరు అభిషేక ప్రియుడైన శివుడిని అభిషేకిస్తారు. రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు ప్రతి శైవ క్షేత్రంలోనూ కొనసాగుతాయి. హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో ఆలయాలను మారుమోగిపోతాయి. ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షతో మహాశివుడిని మనసులో లగ్నం చేసుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించి, జాగరణ చేసిన వారు స్వామి కటాక్షం పొందుతారు. మహాశివరాత్రి పర్వదినం రోజు శివుడిని ప్రార్థించడం ద్వారా ఎంతోమంది తమ పాపాలను అధిగమించి, పుణ్యలోకాలకు చేరుకున్నారని అనేక పురాణాలు ఇతిహాసాలలో చెప్పబడింది. అందుకే మహాశివరాత్రి పర్వదినాన్ని జీవితంలో చీకట్లను తొలగించి కాంతులను నింపే పర్వదినంగా జరుపుకుంటారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *