పోలీసులకు చిక్కిన మంజీరా గ్రూప్ డైరెక్టర్
- Crime
- February 27, 2024
- No Comment
- 42
హైదరాబాద్ రాడిసన్ హోటల్ కేంద్రంగా స్నేహితులతో కలిసి డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసిన.. మంజీరా గ్రూపు డైరెక్టర్ గజ్జల వివేకానంద్తో పాటు మరో ఇద్దర్ని మాదాపూర్ ఎస్వోటీ, గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం తొమ్మిది మంది పార్టీ చేసుకోగా.. ముగ్గురు పోలీసులకు చిక్కారు. సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి కేసు వివరాలను తెలిపారు.
- సొంత హోటల్లోనే డ్రగ్స్ పార్టీ
జూబ్లీహిల్స్కు చెందిన గజ్జల వివేకానంద్ మంజీరా గ్రూపు కంపెనీల డైరెక్టర్. తన కుటుంబానికే చెందిన గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో ఈ నెల 24న స్నేహితులు నిర్భయ్, రఘు చరణ్, కేదార్, సందీప్, నీల్, క్రిష్, యువతులు శ్వేత, యూట్యూబర్ లిషి తదితరులతో కలిసి పార్టీ చేసుకున్నారు. గతంలో మంజీరా గ్రూపు సంస్థల్లో పనిచేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీ ద్వారా 3 గ్రాముల కొకైన్ తెప్పించుకున్నారు. ఈనెల 24 నుంచి 25 అర్థరాత్రి వరకు గజ్జల వివేకానంద్ తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. అయితే సమచారం అందుకున్న మాదాపూర్ SOT, గచ్చిబౌలి పోలీసులు అర్ధరాత్రి హోటల్కు చేరుకున్నారు.
- వివేకానంద్కు బెయిల్
పోలీసులు వస్తున్నారని గమనించి.. అక్కడి నుంచి అంతా పారిపోయారు. రాడిసన్ హోటల్లో పోలీసులు తనిఖీలు చేయగా.. గదుల్లో కొకైన్ ఆనవాళ్లు లభించాయి. దీని ఆధారంగా జూబ్లీహిల్స్లోని వివేకానంద్ ఇంటికెళ్లి అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి ఠాణాకు తరలించారు. విచారణలో స్నేహితులతో కలిసి డ్రగ్స్ వినియోగించినట్లు తేలింది. మూత్ర నమూనాలను పరీక్షించగా డ్రగ్ పాజిటివ్ అని వచ్చింది. తన తండ్రికి చెందిన హోటల్లో తరచూ డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నట్లు వివేకానంద్ ఒప్పుకున్నారు. మరోవైపు నిర్భయ్, కేదార్ను పోలీసులు విచారిస్తున్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నట్లు సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి వెల్లడించారు. వివేకానంద్ను కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం బెయిలు మంజూరు చేసింది.