దేదీప్యమానంగా వెలిగిపోతున్న బాలరాముడు
- National
- January 22, 2024
- No Comment
- 53
ముగ్ధ మనోహర రూపంలో బాలరాముడు అయోధ్యాపురిలో కొలువయ్యాడు. నాలుగు అడుగులకు కొంచెం ఎత్తులో.. చేతిలో స్వర్ణమయ విల్లు, బాణం ధరించిన దశరథ తనయుడు నవ్య రామమందిరం గర్భగుడిలో ప్రపంచానికి దర్శనం ఇచ్చాడు.
రామో విగ్రహవాన్ ధర్మహ అన్నట్టుగానే ఆ మంగళ స్వరూపం ఉంది. చూడగానే ఆకట్టుకునే రూపంలో కృష్ణశిలపై ఎంతో నేత్రపర్వంగా తీర్చిదిద్దారు విగ్రహాన్ని. గర్భగుడిలో స్వామివారి విగ్రహాన్ని కళ్లకు గంతలు కట్టిన తర్వాత ప్రతిష్టించాక బయటకు వచ్చిన ఫొటోలకు.. తాజాగా ఆవిష్కృతమైన విగ్రహానికి అస్సలు పోలిక లేదు. కళ్లు భక్తులనే చూస్తున్నట్టుగా మెరుస్తున్నాయి. బాలరాముడి చిరు మందహాసం మంత్రముగ్ధులను చేస్తోంది. శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్రం చెప్పినట్టుగానే.. అంతకుమించిన స్వరూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు బాల రాముడు. తెల్లటి పాలరాతితో నిర్మించిన గర్భగుడిలో కృష్ణశిలలో కొలువైన స్వామివారు దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు.
శిరస్సుపై కిరీటం… ఆ కిరీటంపై మూడు స్వర్ణమయ నెమలి పింఛాలు.. కంఠహారం.. పట్టు పీతాంబరాలు.. మెడ నుంచి పాదాల వరకు హారం.. నుదుట తిలకంతో ఎంతో చక్కగా భక్తులను ఆకట్టుకుంటున్నారు స్వామివారు. మకరతోరణం మధ్య.. పద్మపీఠంపై శ్రీరాముడి బాల రూపం వీక్షిస్తుంటే అలౌకికానందంలో మునిగి తేలుతున్నారు భక్తులు. పసివాడుగా రాముడు ఇలాగే ఉండేవాడమే అన్నంతగా విగ్రహనికి సజీవ రూపం ఇచ్చారు శిల్పులు. ఇప్పుడు ప్రాణప్రతిష్టతో ఆ విగ్రహ రూపం మరింత ద్విగిణీకృతం అయ్యిందనే చెప్పుకోవాలి.