మేడారం జాతరకు తరలివస్తున్న భక్తజనం
- Telangana
- February 22, 2024
- No Comment
- 69
మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర వైభవంగా జరుగుతోంది. ఆదివాసీల ఆరాధ్య దైవాలైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా మేడారం వైపు కదిలివస్తున్నారు. పిల్లా, పెద్దా అంతా ఒకేచోట చేరి.. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుంటున్నారు. జంపన్న వాగులో స్నానమాచరించి.. అనంతరం అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. కోరిన కోర్కెలు తీర్చాలంటూ అమ్మవార్లకు బంగారాన్ని సమర్పిస్తున్నారు.
పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠించడం జాతరలో తొలి కీలక ఘట్టం. ఈనెల 23న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వనదేవతల్ని దర్శించుకోనున్నారు. గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్రెడ్డి కూడా అదే రోజు మేడారానికి రానున్నారు. జాతర సమయంలో కోటిన్నర మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యంగా మంత్రి సీతక్క మేడారంలోనే ఉంటూ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మేడారం జాతర నిర్వహణకు కేంద్రం 3 కోట్ల రూపాయలు కేటాయించింది. మరోవైపు.. వందల మంది నాట్యకారులు జాతీయ గిరిజన నృత్య వేడుకల్లో పాల్గొన్నారు.