అరకు కాఫీకి అంతర్జాతీయ అవార్డు
- AP
- January 8, 2024
- No Comment
- 73
సాధారణంగా చాలామందికి కాఫీతోనే రోజు మొదలవుతుంది. మరికొందమంది అయితే.. రోజులో ఒక్కసారైనా కాఫీ తాగనిదే ఉండలేరు. ఇంకొందరు రిలాక్సేషన్ కోసం కాఫీ తాగుతూ ఉంటారు. ఇక ఆఫీసులకు వెళ్లి కంప్యూటర్ ముందు పనిచేసే వారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాఫీ కాని, టీ కాని ఒక్కసారైనా కడుపులో పడందే పని ముందుకు సాగదు అంటారు. అయితే ఇప్పుడు అలాంటి ఓ కాఫీ బ్రాండ్ అంతర్జాతీయ అవార్డు గెలుచుకుంది. అది కూడా మన ఏపీలోని విశాఖ జిల్లా గిరిజన ప్రాంతంలో దీన్ని ఎక్కువగా పండిస్తుంటారు.
ముఖ్యంగా భారత్ లో అరకు కాఫీ టాప్ బ్రాండ్స్ లో ఒకటి. వందేళ్ల క్రితం విశాఖ మన్యానికి చేరిన ఇది కాఫీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకుంది. ఇక్కడ గిరిజనులు సేంద్రియ పద్ధతుల్లో కాఫీని పండిస్తూ ఉంటారు. ముఖ్యంగా అరకు కాఫీ గురించి తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. 1898లో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పాములేరు లోయలో.. అప్పటి ఆంగ్లేయులు కాఫీ పంట వేశారు. అక్కడి నుంచి కొద్ది కాలానికి విశాఖ జిల్లా గిరిజన ప్రాంతాల్లోకి కాఫీ పంట విస్తరించింది. 1920కి కాఫీ అరకు లోయలోని అనంతగిరి, చింతపల్లి ప్రాంతాలకు చేరుకుంది. అయితే అది ఎక్కువగా సాగు అవ్వలేదు.
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ 1960లో విశాఖ జిల్లాలోని రిజర్వ్ అటవీ ప్రాంతంలో కాఫీ పంటను 10 వేల ఎకరాలలో అభివృద్ధి చేసింది. ఈ కాఫీ తోటల్ని 1985లో అటవీ అభివృద్ధి సంస్ధకు అప్పగించింది. 1975 నుంచి 1985 వరకు జీసీసీలో ఒక ప్రత్యేక కాఫీ తోటల అభివృద్ధి విభాగం ఏర్పాటు అయ్యింది. సుమారు 4000 హెక్టార్లలో సేంద్రీయ పద్ధతుల్లో కాఫీ తోటల పెంపకం గిరిజన ప్రాంతాల్లో మొదలయ్యింది. సేంద్రీయ పద్ధతుల్లో గిరిజనుల చేత అరకులోయలో పండుతున్న కాఫీకి అరకు కాఫీ అనే పేరు పెట్టారు. ప్రపంచంలో కాఫీని ఎక్కువగా పండించే దేశాల్లో భారతదేశం ఏడో స్థానంలో ఉంది.