సీడబ్ల్యూసీ పునర్ వ్యవస్థీకరణ.. రఘువీరాకు కీలక పదవి
- National
- August 20, 2023
- No Comment
- 399
త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ సంస్థాగతంగా కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలిగా ఉన్న సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించింది. మొత్తం 84 మందితో జాబితాను విడుదల చేసింది. దీంట్లో 39మందిని డబ్ల్యూసీ సభ్యులుగా, 18 మందిని CWC శాశ్వత ఆహ్వానితులుగా ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం.. 14 మంది ఇంఛార్జిలు, తొమ్మిది మంది ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురు ఎక్స్అఫిషియో సభ్యులతో కమిటీని ప్రకటించింది.
సీడబ్ల్యూసీలో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి చోటు దక్కింది. ఈ అత్యున్నత నిర్ణాయక కమిటీలో ఏపీ నుంచి మాజీ మంత్రి రఘువీరారెడ్డిని సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఎంపిక చేయగా.. శాశ్వత ఆహ్వానితులుగా తెలుగు రాష్ట్రాల నుంచి టి.సుబ్బరామిరెడ్డి, కె.రాజు, దామోదర రాజనర్సింహకు అవకాశం దక్కింది. అలాగే, ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లంరాజు, వంశీచంద్ రెడ్డిలను ఎంపిక చేశారు. గతేడాది అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే సీడబ్ల్యూసీ స్థానంలో 47మందితో తాత్కాలికంగా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.
తాజాగా మళ్లీ సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరిస్తూ ఆదివారం జాబితాను విడుదల చేశారు. కాంగ్రెస్లో అసమ్మతి వర్గంగా పేరొందిన.. జీ23 నేతలైన శశిథరూర్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్లకు ఈ కమిటీలో చోటు కల్పించారు. సచిన్ పైలట్తో పాటు, దీపా దాస్ మున్షి, సయ్యద్ నసీర్ హుస్సేన్లను కొత్తగా సీడబ్ల్యూసీలోకి తీసుకున్నారు. మున్షి బెంగాల్కు చెందిన మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ప్రియ రంజన్దాస్ మున్షీ సతీమణి. అలాగే, సయ్యద్ నసీర్ హుస్సేన్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.