జనసేనాని మౌనం వెనుక
- AP
- September 25, 2023
- No Comment
- 377
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు తర్వాత.. జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ నానా హడావుడి చేశారు. బాబును కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే రోడ్డుపై పడుకుని మరి నిరసన తెలిపారు. తరువాత బాలకృష్ణ, నారాలోకేష్తో కలిసి.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును కలిశారు. బాబుతో ములాఖత్ తర్వాత బయటికి వచ్చిన పవన్.. టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నాయని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కూడా తమతో కలిసి వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. సైకో జగన్ ని ఇంటికి పంపించడమే తమ తక్షణ కర్తవ్యం అని.. ఆరు నెలలే సమయం ఉందంటూ పవన్ వ్యాఖ్యానించారు.
టీడీపీ, జనసేన పొత్తును ప్రకటించిన తర్వాత ఉమ్మడి కార్యాచరణ ఉంటుందని పవన్ చెప్పారు. ఆ తర్వాత మళ్లీ బాబు అరెస్టు విషయంపై చప్పుడు చేయకుండా పవన్ ఉన్నట్టుండి సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం పవన్ తన సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. సుజిత్ దర్శకత్వంలో OG,హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ చేసుకుంటున్న పవన్ మళ్ళీ రాజకీయాల్లో యాక్టీవ్ కావాలని జనసైనికులు కోరుకుంటున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలోనే జనసేనాని పబ్లిక్ లో కనిపిస్తే పొలిటికల్ మైలేజ్ పెరుగుతుందని అంటున్నారు. మరి ఇంతకీ ఎందుకు పవన్ సైలంట్ అయ్యారు? అని అంతా చర్చించుకుంటున్నారు. టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణకు బీజేపీ నుంచి ఏమైనా అడ్డంకులు ఏర్పడుతున్నాయా? జనసేన పార్టీలోనే కొందరు పొత్తును వ్యతికేరిస్తున్నారా? రెండు పార్టీల మధ్య ఏం జరుగుతోందనన్నది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పవన్ బయటికి రాకుండా బీజేపీ కళ్లెం వేసినట్లు కొందరు అనుకుంటున్నారు. తమను సంప్రదించకుండా పొత్తు ప్రకటించడం పై బీజేపీ అధిష్టానం కాస్త గట్టిగానే గుర్రుగా వున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపైనే.. పవన్ సైలంట్ అయ్యారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరోపక్క ఉన్నట్లుండి చంద్రబాబును వెనకేసుకు వస్తూ, ఏ లెక్కలు తేల్చకుండానే… తేలకుండానే పొత్తు ప్రకటించడం పట్ల కాపు సంఘాల పెద్దలు గట్టిగా బాధ పడినట్లు తెలుస్తోంది. పైగా తెలుగుదేశం ఏం అన్నా పట్టించుకోవద్దని, పొత్తుకు బ్రేక్ అయ్యే పనులు ఏవీ చేయవద్దని కాపులకు పిలుపు ఇవ్వడం కూడా వారికి నచ్చలేదు. ఇవన్నీ పవన్ కు చేరవేయడం కూడా జరిగిందని తెలుస్తోంది.