తెలంగాణ రాజకీయాల్లో బిగ్ డే
- Telangana
- September 16, 2023
- No Comment
- 354
తెలంగాణ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. రాష్ట్ర, జాతీయ పార్టీల నాయకులంతా తెలంగాణ రాష్ట్రంలో వాలిపోయారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఇన్నాళ్లు ఢిల్లీలో మాత్రమే సమావేశాలు జరిపిన కాంగ్రెస్.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత తెలంగాణపై పూర్తిగా ఫోకస్ పెట్టింది. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకువచ్చేందుకు అగ్రనేతలంతా ఇక్కడికి వచ్చేశారు. మరోవైపు.. బీజేపీ కూడా వెనక్కి తగ్గకుండా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఒకవైపు తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభ నిర్వహించనుండగా.. బీజేపీ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా విమోచన దినోత్సవ వేడుకలు జరపనుంది. ఇందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ రానున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వానికి ధీటుగా.. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ సభలు జరుపనున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాల్లో చర్చల అనంతరం.. రేపు తుక్కుగూడ బహిరంగ సభ వేదికగా.. 5 హామీలను సోనియా గాంధీ ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే.. కేసీఆర్ పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. పాలమూరు ప్రాజెక్టును గత పాలకులు, నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. బీజేపీ వాళ్లకు సిగ్గు, పౌరుషం అనేది ఉంటే.. ఇప్పుడు వచ్చి మాట్లాడటం కాదు.. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ రాష్ట్రానికి నీళ్ల వాటా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని అన్నారు. ఇక మరోవైపు.. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది. మొత్తానికి తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.