నా దమ్మేంటో దేశమంతా తెలుసు..
- Telangana
- October 26, 2023
- No Comment
- 290
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ అచ్చంపేటలో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్కు, కాంగ్రెస్కు కేసీఆర్ స్ట్రాంగ్ పొలిటికల్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ దమ్మేంటో దేశం మొత్తం చూసిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం తాను బయలుదేరి 24 ఏళ్లు అయ్యిందని చెప్పారు. తెలంగాణ సాధన కోసం తాను పక్షిలా తిరిగాను అని.. కొంతమంది ఇప్పుడొచ్చి కేసీఆర్కు దమ్ముందా? అని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ వచ్చేది లేదంటూ ఒకప్పుడు హేళనగా మాట్లాడారు. పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టే తెలంగాణ సాధించుకున్నామని కేసీఆర్ గుర్తు చేశారు.
కొడంగల్కు రా అని ఒకరు.. గాంధీభవన్కు రావాలని మరొకరు సవాల్ చేస్తున్నారని కేసీఆర్ అన్నారు. కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని.. రాజకీయం అంటే ఇలాంటి సవాల్ చేయాలా? అని ప్రశ్నించారు. వాళ్లకు దిక్కులేకపోయినా.. నీతులు చెప్పేందుకు వస్తున్నారని ఎద్దేవ చేశారు. ఎవరు ఎవరికి ఉపన్యాసాలు ఇస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు.. పదేళ్లలో దేశానికి దిక్సూచిలా తెలంగాణను మార్చామని చెప్పారు. దేశంలో రైతుబంధు పుట్టించిందే తాను అని అన్నారు. మెడపై కత్తిపెట్టడమే తప్ప రైతుకు రూపాయి ఇచ్చారా? అని ఆయన నిలదీశారు.