బీఆర్ఎస్, గవర్నర్ మధ్య మరో రచ్చ
- Telangana
- September 27, 2023
- No Comment
- 322
గులాబీ శ్రేణులకు తెలంగాణ గవర్నర్ ల మధ్య మరోసారి పొలిటికల్ సీన్ భగ్గుమంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల అభ్యర్ధిత్వాలపై యుద్ధం మొదలైంది. గవర్నర్ తమిళిసై వద్దకు ఎమ్మెల్సీల అభ్యర్ధిత్వాలని పంపింది తెలంగాణ ప్రభుత్వం.. దీన్ని తిరస్కరించి వెనక్కి పంపారు గవర్నర్. దీంతో ఇప్పుడు గవర్నర్ పై బీఆర్ఎస్ నేతలు కాలు దువ్వుతున్నారు.
తెలంగాణలో మళ్ళీ గవర్నర్ వర్సెస్ బిఆర్ఎస్ అన్నట్టుగా రాజకీయ రగడ మొదలైంది. ఇటీవలే కొన్ని బిల్లుల ఆమోదం విషయంలో పెద్ద రచ్చ నడిచింది. అయినా ఎప్పటినుంచో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల అభ్యర్ధిత్వాలని గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్కుమార్, కుర్రా సత్యనారాయణను నామినేట్ చేయాలంటూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారినే.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాల్సి ఉంటుందని, ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ఇద్దరికి అటువంటి అర్హతలు లేవని, ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసేందుకు వారు అనర్హులని స్పష్టం చేశారు. అయితే ఇలా ఎమ్మెల్సీ అభ్యర్ధులని తిరస్కరించడంపై గవర్నర్ టార్గెట్ గా బిఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. గవర్నర్ తీరు బాధాకరమని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బిజేపి బిసి వ్యతిరేక పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. గతంలో పాడి కౌశిక్ రెడ్డి విషయంలోనూ ప్రభుత్వానికి ఇదే రకమైన ఎదురు దెబ్బ తగిలింది.