హైదరాబాద్లో హై అలర్ట్.. ట్రాఫిక్ మళ్లింపు
- Telangana
- September 16, 2023
- No Comment
- 377
రాష్ట్ర వ్యాప్తంగా రేపు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే అధికారికంగా నిర్వహించే కార్యక్రమానికి సీఎం కేసీఆర్, రాజభవన్లో గవర్నర్ తమిళసై సౌందర రాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. మరోవైపు నగరంలో కాంగ్రెస్ సీడబ్ల్యూసీ మీటింగ్, తుక్కుగూడలో విజయ భేరి సభ నిర్వహిస్తున్నారు. దీంతో నగరం రోడ్లపై వీఐపీలతో సందడి నెలకొంది. దీంతో జంట నగరాల్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు నగర పోలీసులు విధించారు.
ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర మంత్రి అమిత్ షా సభ ఉండడం వల్ల రైళ్లలో ప్రయాణించాలనుకునే వారు… సకాలంలో చేరుకోవాలని సూచించారు. పరేడ్ గ్రౌండ్ పక్కన ఉన్న రోడ్డు నుంచి సీటీవో నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించరు. ప్లాజా ఎక్స్ రోడ్ నుంచి ఎస్.బీ.ఐ ఎక్స్-రోడ్ రోడ్డు మూసి వేయనున్నారు. వైఎంసీఏ ఫ్లై ఓవర్ ద్వారా మాత్రమే ట్రాఫిక్ అనుమతించనున్నారు. బోయిన్పల్లి, తాడ్బండ్ నుంచి టీవోలి వైపు వచ్చే ట్రాఫిక్ బ్రూక్ బాండ్ వద్ద సీటీవో వైపు మళ్లించనున్నారు. కార్ఖానా, జేబీఎస్ నుంచి ఎస్.బీ.హెచ్-పాట్నీ వైపు వచ్చే ట్రాఫిక్ స్వీకర్ ఉపకార్ వద్ద టివోలి-బ్రూక్ బాండ్ వైపు మళ్లించనున్నారు. టీవోలి ఎక్స్-రోడ్ నుంచి ప్లాజా ఎక్స్-రోడ్ల మధ్య రోడ్డు రెండు వైపులా మూసివేయనున్నారు.